పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

9, మే 2016, సోమవారం

అమ్మను అయితే అయ్యాను,గానీ ......????????????




అమ్మను అయితే  అయ్యాను,గానీ ... 
ఏదో సంధిగ్ధంతో సతమతమవుతూనే ఉన్నా ...
 నా బిడ్డడు ,రాముని తలపించే  ఆదర్శమూర్తిగా అవతరిస్తాడో .. 
 రక్కసుడల్లె  కర్కశుడే  జనియిస్తాడో ?
కన్నతల్లికి, జన్మభూమికి   ఖ్యాతి పెంచే  రత్నమల్లె మెరిసిపోతాడో ..    పుడమి  తల్లికే కే పెను భారమయ్యే కరుడు గట్టిన  పాషాణమల్లే  పరిణమిస్తాడో , 
కన్నవారినీ ,కాలరాసే  కాల యముడికి ఊపిరోస్తానో .. 
కలియుగానికి ఆలవాలమవు   అపర రావణున్నే ఇలకు తెస్తానో ,
కీచకుడే పుడతాడో ,సమాజానికి పట్టిన  చీడపురుగుల్లో ఒకడికి నేనే తల్లవుతానో ,
ఒక మానవత్వమూర్తినే కని  తెగ మురిసిపోతానో .. 
మహాత్ముడు కాకున్నాగాని,మంచికి ఊపిరిపోసే మాన్యుడైతే చాలు .  
నలుగురితో  నారాయణ కాదు  . పలువురికోసం  ప్రాణాలిచ్చే ,
జన్మభూమికి వన్నె తెచ్చే , 
అనాకారియైనా ఆనందమే ,అహంకారి కాకుంటే సరి . 
ఆ యమ్మ కన్నబిడ్డ కనకమనిపించాలి .
కనకనే . కునుకే కరువయి  ఓ  అమ్మ పడే    ఆరాటం . 
పాపో ,బాబో తెలిపే పరికరాలు పుట్టెడు ఉన్నా , పట్టెడు మెతుకులు పెడతాడని ,
మంచికిమారుగా పుడతాడని ,చెప్పే యంత్రం ఉంటే బావుండుకదా !
 చీడ పురుగునుకడుపులోనే కాలరాసి ,
మానవత్వం పరిమళించే మాన్య బిడ్డకు జన్మనిచ్చి ధన్యమవదా ..ప్రతి కన్నతల్లి .   (సమాజంలో జరుగుతున్న అరాచకాలకు భయభ్రాంతురాలైన నిండు గర్భిణి ఆవేదన )
.నిజానికి పుట్టినప్పుడు ప్రతీ బిడ్డా పరమ పావనుడే ,ఏ బిడ్డా జన్మతః దుర్మార్గుడు కానేకాదు . 
 బుద్ధి నెరిగిన నాటి నుండే , వక్రమార్గపు వెతుకులాటలు .,వెర్రితలలు వేస్తున్న అక్కర లేని  ఆధునికతల ముసుగుల్లో , వింత వింత పోకడలు , మత్తుల్లోమునిగిపోయి  మతిభ్రమించి పరిభ్రమించేరు అభినవ కౌరవుల్లా .. 
అందులకే చెబుతున్నా .. 
తల్లులార మీ బిడ్డల భవితకు బంగారు తాపడాన్ని మీరే అద్దాలి . 
తల్లి తలచిన కాని కార్యము లేదు జగాన తనయుల తీర్చి దిద్దుటలో ..... రేపటి పౌరునిగా మలచుటలో .. 
ఉగ్గుపాలు , ముద్దు మురిపాలతో ,పాటు 
మానవత్వపు పాలు  రంగరించి పెంచి చూస్తే  ప్రతీ తల్లి . 
పెడత్రోవకెక్కడ తావుంది ?ప్రేగు పంచుకొన్న బంధానికి ?
మన సుసంపన్న సంస్కృతినీ ,సాంప్రదాయ రీతులనీ ,నైతిక విలువల్నీ, అక్షరాభ్యాసంతో పాటూ అవపోసన పట్టిస్తే ,
ఆణిముత్యమల్లే మారడా ... అమ్మా ,నాన్నల కనుల వాకిలిలో 
 కోరుకొన్న భవితవ్యం రంగవల్లిగా తారసపడదా  .  ఏ ఆధునికత ప్రభావమైనా ,పెచ్చు మీరిన సాంకేతిక విజ్ఞానమైనా ,తల్లి నేర్పిన మొదటి పాఠపు పరిజ్ఞానం ముందు పటాపంచలయిపోదా . దుష్టలోచన దూరమవదా ..  
 ఎన్ని యుగాలు మారినా ,ఒక కన్న తల్లి   సంకల్పిస్తే ,ప్రతీ బిడ్డ  పసిడి తుల్యం . 
సమాజ ప్రక్షాళనలో ప్రముఖ పాత్రధారిణి  మాతృమూర్తి .  నవ సమాజ నిర్మాణంలో క్రియాశీలి ఒక తల్లే . 
అందుకే , తల్లి చూపిన సన్మార్గమే రేపటి కల్మష రహిత సమాజానికి వారధి . ప్రతీ తల్లీ సారధే ..  రేపటి భావి భారత పసిడి రధానికి .  మొక్కై  వంగనిది . మానై వంగునా .. అంటూ ఊరక కూచోక 
 నారులోనే మానవత్వపు నీరుపోసి ,మంచి మార్గం నిర్దేశిస్తే , నిక్కంగా కొంగు బంగారమే ,అమూల్యమైన బహుమానమే,అమృత ఫల నైవేద్యమే 
ప్రతీ బిడ్డా ..  పరమ పావన భారతావనికి . (అవునంటారా నా మాటలను , కొట్టి పారేస్తారా నీతులని )           
                                                            సాలిపల్లిమంగామణి @శ్రీమణి 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి