పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

27, మే 2016, శుక్రవారం

నిండు జీవితం.. నీటి బుడగరా!



కరగవద్దని బ్రతిమలాడిన కదలకుండునా పరుగులెత్తే కాలచక్రం
చెరగవద్దని వాదులాడినా కరగకుండునా   .. కమ్మని స్వప్నం .
పండుటాకును పదిలపరచినా .. తరువునొదలక మానునా .. మన్ను కలవక మానునా .. 
రాతిరికి రారాజైనా  వెన్నెలరేడుకి .. అంధకారం కమ్ముకోదా... అమావాస్య అలుముకొదా !
ప్రచండ భానుడైనా  ... సేద తీరడా రేయి మాటున .
అల అలసి పోదా  ... అరక్షణమయినా ..తీరం దరి చేరి,. 
విరిసి మురిసిన పరిమళ  కుసుమమయినా ... వసివాడక తప్పదు కదా ..
కారుమబ్బు కదలి ,కదలి ,కరిగి కరిగి కడలిఒడికి  చేరదా ......
వినీల గగనాన విహరించినా విహంగం విశ్రమించక తప్పదుగా ... ఏ క్షణమయినా ...
పంచభూతాలకూ తప్పని గమనం,ప్రకృతి ఆద్యంతానికి  తప్పని నిష్క్రమణం . 
వెలుగు నీడలెంత సహజమో ... 
ఆగమనం, నిష్క్రమణం అంతే సహజమన్న నిజాన్ని జీర్నిన్చుకోలేకపోవడం  
 మానవుని మనోదౌర్భాల్యం కదా ... 
 నిండు జీవితం..  నీటి బుడగ తీరు కదా .... నిష్క్రమించుట నిక్కమే కదా  ... 
పుట్టిన మొదలు  ఎందుకు మరి ఈ పోరాటం,దేనికోసం అర్ధంలేని ఆరాటం,కులం,మతం,
 అడుగడుగునా అవినీతి,స్వార్ధ తత్వం, పైసా కోసం పైశాచికత్వం,అమానుషత్వం,అరాచకత్వం,
వచ్చిన కర్తవ్యం మరచి బాడుగ ఇంటిని సొంతమనుకొనే మన అమాయకత్వం,
ఏనాటికైనా ఇహమొదలక తప్పదే! ఇంకెందుకు అర్ధం లేని వ్యర్ధ కలాపం;
అందుకే జీవించు ,రేపటి తరానికి ఆదర్శంగా .. 
ఆనందించు నీ కృషితో,
అందించు.. నిన్ను నమ్మిన వారికి నీ ఆత్మీయతానురాగాలతో నీ కష్టార్జితాన్ని,
పంచు.. పలువురికీ మంచిని,మానవతను
నిష్క్రమించు ఏ క్షణమయినా... చిరు నవ్వుతో... ఆత్మతృప్తితో ... 
జీవించు,
జీవితాన్ని సఫలం  గావించు ,జీవించి ఉన్న ప్రతీ క్షణం పదిలంగా అనుభవించు,
రేపటి తరానికి మార్గదర్శిగా పయనించు,ఆయువున్నంతవరకూ ..  
నువ్వున్న... లేకున్నా.. నువ్వాచారించిన నీ ధర్మం నిన్ను చిరంజీవిగా నిలుపుతుంది. 
 మహోత్కృష్టమయిన మానవ  జన్మ సార్ధక్యం తెలుపుతుంది 

                                                                   సాలిపల్లిమంగామణి@శ్రీమణి 








25, మే 2016, బుధవారం

అప్పుడే.... మొదలయ్యింది.


నీలిమేఘాలు వరుసల్లు  ముసురేసినప్పుడు 
చిరుగాలి పరదాలు చిరుజల్లులై విరబూసినప్పుడు   
విరజాజి ఘుమఘుమలు గుమ్మెత్తినప్పుడు 
జాబిలి మాటున నేను నిదరోతున్నప్పుడు 
మరుమల్లె మంతనాల మత్తెక్కిస్తున్నప్పుడు 
మయూరమై  మైమరచి నటియించినప్పుడు 
 కోనేటి  వంపుల్లో రాయంచనై విహరించినప్పుడు 
 పులకించి మేనంతా పూమాలలైనప్పుడు 
 పూబాలతో చేరి ఊసులాడినప్పుడు ,
 నులుసిగ్గుల  దొంతరలో దోబూచులాడినప్పుడు
తూనీగతో చేరి సరాగాల తేలినప్పుడు,
చేరి చెలియల తోడ ఊయలూగుతున్నప్పుడు 
చుక్కలు ప్రక్కన చేరి పక్కున నవ్వినప్పుడు,
అప్పుడే ... మొదలయ్యింది. 
నా పరువం  మరువమై  మైమరచి విరిసింది. 
నా ప్రాయం పరవశించి విరబూసింది.  
అప్పుడే, అప్పుడే నా గుండెలో సప్పుడు మొదలయ్యిది. 
అప్పుడే నా తనువంతా వింత ఊహల  ఉప్పెన పొంగింది 
తన రాక సవ్వడికి,నా గుండె గుడికి, వలపుల గది తెరచుకొంది 
అప్పుడే నా మనసున మరు మల్లియ విరిసింది. 
అప్పుడే....  
తియ, తీయని  విరి తేనియ కురిసింది నా హృదయంలో  
హాయి,హాయిగా వెన్నియలే కురిపించింది  నా ప్రణయంలో ... 
                                               సాలిపల్లి మంగామణి@ శ్రీమణి 



22, మే 2016, ఆదివారం

ఓ చిలకల కొలికీ !


ఓ చిలకల కొలికీ ! నీ పలుకుల తళుకుల జడికీ 
ఉలిక్కిపడనీకే..  నా ఊహల వనమాలీ  
ఓ వెన్నెల జాబిల్లీ !నా వలపుల  జిలిబిలీ 
 ఆదమరచమాకే! తలపుల చక్కేరకేళీ 
 ఓ వన్నెల సిరిమల్లీ!నా చిన్ని ఎదగిల్లి
నీ పరువాలు వెదజల్లీ ..  వెళ్ళొద్దే చెలీ 
నా హృదయాన్ని,ఒదిలీ 
నా ప్రణయాల నెచ్చెలి, నిను తలచి తల్లడిల్లి 
నీ ప్రణయపు అల్లిబిల్లి  మాలిక అలవోకగా అల్లీ 
మళ్ళీ మళ్ళీ నా మనసు..  తుళ్ళే నీ వల్లే 
ఎట్టా?వేగేదే చెలీ ...... 
అను క్షణం నీ తలపుల తల్లడిల్లి 
 నీలాటి రేవులోనీరూపు  మరువలేకున్నా.. 
 వేలాది రాగాలు పాడుకొన్న వైనాలు .మరువలేకున్నా  
 కొనగోటితో మీటిన నీ నీలి ముంగురులు 
ఊసులాడుకున్న ఇరు నయనాల ముచ్చట్లు 
పరవశాన పదనిసలై పారాడిన  ప్రాయాలు 
మన మనసున  ఉరికిన నయగారపు హొయలు.. మరువలేకున్నా 
చేతిలో చెయ్యేసి నడిచెళ్లిన ఛాయలు 
చేసుకొన్న బాసలు, పారేసుకొన్న మనసులు 
రెండు తనువులు ,ఒకటే హృదయమై పల్లవించిన క్షణాలు 
 మరువలేకున్నా ... ఎక్కడున్నావో మరి,
నన్ను చేరరావే నా పరువాల నెచ్చెలీ 
నా శ్వాసలోనూ .. 
నీ కోసమే చూసా ... 
నీ ధ్యాసలోనే ... 
నా ఆశ పరిచా .. 
నను చేరగా రావేలనే 
నువ్వు లేని నేను 
మనిషినైతే ... కాను 
ఒక నడిచే శిలను 
నిజమెరుగని కలను 
కలనైనా ,, మరలా నిన్నే కలగంటాను. 
ఇలలో ఎక్కడ ఉన్నా.... ఇట్టే కనిబెడతాను
(ప్రేమికకు దూరమైన ఒక ప్రేమికుని వేదన )
                                          సాలిపల్లిమంగామణి@శ్రీమణి 


18, మే 2016, బుధవారం

తరువు గుండె తరుక్కుపోయి,


తరువులు తల్లడిల్లె తమ ఉనికి మాయమవుతుందని,
మానవులకు తాము చేసిన అన్యాయమేమనుచు 
మానవాళికి ఆయువిచ్చు తమ ప్రాణం తీయుదురాయని,
నీడనిచ్చు మాజాతిని నిర్దయగా కూల్చుదురాయని
మీ పాపానికి ఠారెత్తిన భూతాపం. చల్లార్చిన మా పైనా మీ ప్రతాపం. 
మిము కభళించే కాలుష్యం కరిగిస్తూ,
మా చల్లని గాలుల అలసిన మీకు సేద దీరుస్తూ  
అమృతఫలాలనిస్తూ,మీ ఆకలి తీరుస్తూ,
మీకోసం పెరుగుతూ,మీకోసం మండుటెండల్లో మరుగుతూ
మా తనువున అణువణువూ మీ కోసం కరుగుతూ,
మా సర్వస్వం మానవాళికర్పించే 
మా పైనా మీ అమానుషత్వం?
జాలిలేని మానవుడా... మా జోలికి రావద్దని,మా ప్రాణంతీయొద్దని,
విలపిస్తూ వేడుకొనెను వృక్షజాతి విరిగిన కొమ్మల తోడ,
తరువు గుండె తరుక్కుపోయి,
అపకారికి ఉపకారం మహాత్వంటూ నీతులు చెప్తారే,
మీ జాతికి మహోపకారం చేసిన మా కిదేనా?మీ ప్రత్యుపకారం?
 ఒక్క క్షణం. ఒకే ఒక్క క్షణం మా కోసం ఆలోచించండి. 
పుడమి తల్లి పులకించేలా,ప్రకృతి పరవశించేలా.. 
కరువు కాటకాలు నశియించేలా... 
పర్యావరణం పరిమళించేలా .. 
భావితరం సస్యశ్యామలంగా,పసిడి వెలుగుల పల్లవించేలా  
మము కాపాడగా... ఉద్యమించండి. 
నవ అశోకులై నడుం బిగించండి. 
పచ్చని మా జాతిని ఉద్దరించండి. 
ప్రతి ఒక్కరు చక్కగా ఒక మొక్కని 
నాటి పెంచండి. 
లోకా సమస్థా... సుఖినో భవంతు 
వృక్షో రక్షిత,రక్షితః 

                                                   సాలిపల్లి మంగామణి @శ్రీమణి 

16, మే 2016, సోమవారం

సిన్నీ,సందమామ



సిన్నీ అన్నం  తిందువు రావే అంటూఅమ్మ  పిలిచిన కేకకు ,బంతి పూలు కోస్తున్న చిన్నీ ఒక్కటే పరుగు తీసింది లోనికి ,అప్పటికే ఆకలి దంచేస్తుంటే , ఏం చేశావే ఈవేళ అంటూ రాములమ్మను చుట్టేసింది . ఏముంది గట్ల మీద వేసిన బెండకాయలు కోసి పులుసు కాసాను . మీ నాన్నకి భలే సంభరం ఆ పులుసంటే , వస్తూ ఉంటాడు సూడు వాకిట్లోకెల్లి అందరం కలిసే తిందాం . సోములు రానే వచ్చాడు .  మండువాలో కాళ్ళు కడుక్కుని ,మీరు తినేయచ్చు కదే ,నాకోసం సూత్తే చిన్నీ కి ఆకలేసేత్తాది  .ఏవయ్యా నువ్వు లేకుండా మేము ఎప్పుడన్నా తిన్నామా ..
సరే సరే  పెట్టేయవే అంటూ  పీట మీద కూర్చుని లొట్టలేసుకుంటూ లాగించేసాడు . రెండు ముద్దలు  ఎక్కువే . తింటున్నంత సేపు వాగుతూనే ఉంది చిన్ని . అన్నం తినే కాడ మాట్లాడ మాకే   పొలమారతాది అంటూ రాములమ్మ వారించినా ఆ వాగుడుకాయ మాత్రం ఆపనే లేదు . పెరట్లో కూచుని రాములమ్మ సోములు పొలం విషయాలు , ఊరిలో కబుర్లు మాట్లాడుకొంటూ ఉంటే చిన్నీ మాత్రం చందమామ వంక చూస్తూ అమ్మా..  చందమామ పట్నం ఎప్పుడూ ఎల్లడా రోజూ మనూరిలోనే ఉంటాడేంటి . అంటే రాములమ్మ లేదు లేదు ఒకసారి పట్టణానికి మీ నాయన నేను   ఎల్లిన రేత్రి మాతో పాటు వచ్చాడే ,అంటూ అమాయకంగా సెప్పింది కూతురికి , చిన్నీ కి మాత్రం ఎప్పుడూ మనసంతా చందమామ మీదే ఎన్నో ఊసులు చెప్తూ , ఏదో ఒకరోజు నన్నూ నీ కూడా పట్నం తీసుకెల్లవా అంటూ బ్రతిమాలుతూ మళ్ళీ తనే ఊకొడుతూ , పాడుకొంటూ నిద్రలోకి జారుకోవడం అలవాటు . చిన్నీ నిద్ర పోయిందంటే వానొచ్చి ఎలిసినట్టే ,అనుకొంటూ ఆప్యాయంగా కూతుర్ని దగ్గరకు తీసుకొని పడుకొండిపోయారు ఆ పండువెన్నెల్లో , లేచీ లేవగానే లేగదూడ దగ్గరికి పరుగుతీసి పద ఆడుకొని వద్దాం అంటూ ,లాక్కొని వెళ్లి ,తోటి పిల్లలందరినీ లేపి తోటలోకొచ్చి తనకిష్టమైన ముద్దబంతి మొక్కతో మాట్లాడటం మొదలెట్టింది .
ఈరోజు అమ్మ నా జడ గుప్పుతానంది . ఏమి అనుకోకు నీ పూలన్నీ కోసేస్తా ,కొన్నేమో గుళ్ళో ఇస్తా  ,మిగతావి మాత్రం నాజళ్ళోకి ,సరేనా అంటూ చకా చకా పూలన్నీ ఒళ్లో నింపేసుకొని ,గుళ్ళో పంతులుకి కొన్ని పూలిచ్చి దేవుడిని ఏం అనుకోవద్దని చెప్పండి . ఈరోజు నాకు అమ్మ జడ గుప్పుతానంది . అందుకే తక్కువిచ్చానని సర్ది చెప్పండి . అంటూ ఇంటివైపు దూసుకెళ్లింది ,రాములమ్మ చుట్టూ తిరిగి జడ కుట్టిన తర్వాతే నువ్వు నాయన కాడికి పొలానికెల్లు అంటూ మారాం చేసింది . యెంత అల్లరి చేసినా ఒక్కతే లేక లేక పుట్టిన పిల్ల కావడంతో సాలా ముద్దు వాళ్లకి , సిన్నీకి జడ గుప్పి ముస్తాబు చేసి ఎడమ కాలు మన్ను తీసి చెంప మీద దిష్టి చుక్క పెట్టి సద్దన్నం తినేసి ఆడుకో నేను పొలానికి పోతున్నా .. అని వడివడిగా వెళ్ళిపోయింది రాములమ్మ . ఉన్నోళ్ళు కాకపోయినా ఒక ఎకరం భూమి దాన్ని పండించుకొని మూడుపూటలా లోటులేకుండా జరిగిపోయేది . సోములింటికే  కాదు ఆఊరు మొత్తానికి కంటి దీపం సిన్నీ , సిన్నీ ఒక రోజు జ్వరం పడ్డాదంటే ఊరంతా మూగబోయినట్టే ,గుళ్ళో దేవుడితో సహా ,
సహజంగా కుందనాలబోమ్మలాంటి సిన్నీకి ఆరోజు అమ్మవారి జాతర కావడంతో చిలుకపచ్చ పరికినీ గులాభీ రంగు జాకిట్టు వేసి జడ  కుచ్చులు పెట్టి అందంగా ముస్తాబు చేసింది రాములమ్మ . దీని పెళ్ళికి ఇప్పటినుండే ఎనకేయ్యాలి
ఒక అయ్య సేతిలో పెట్టాలి  అనుకొంటూ తనలో తానే అనుకొంటూ లోనికి వెళ్ళింది . ఇంతలో సోములు దిగాలుగా వచ్చి నులక మంచం మీద కూలబడిపోయాడు మాటా మంతీ లేకుండా . ఏవయ్యా ఊరంతా  జాతర అవుతుంటే నువ్వేటి ఇలాగాయిపోయినావు . లే లే జాతరకెల్లాలి . సిన్నీ ఇంతకుముందే పిల్లలతో పోయినాది . అంటున్న రాములమ్మని ఒకసారి ఇలా రావే కూచో అంటూ పిలిచాడు . ఏవయ్యా ఏమి జరిగినాది  అట్టాగున్నవే . ఆ సేమట్లేటయ్యా ఇంత సల్లగా ఉంటే ,ఏమయింది అంటూ నిలదీసింది . అంతా అయిపోయినాదే నిరుడు వచ్చిన కరువుకి నాయుడు గారి దగ్గర చేసిన అప్పు రెండింతలయి కూచుంది . ఈ ఏడాది పంటతో కొంతైనా తీర్చేద్దమనుకొంటే ఈ ఏడూ వర్షం లేక తిండి గింజ కూడా వచ్చేలా లేదు . నాయుడు గారు అప్పు తీర్చమని పంచాయితీ పెట్టారు .  లేదంటే ఉన్న ఎకరం  వడ్డీ కి , 
అసలుకీ జమ చేసు  కొంటారంట . నెల రోజుల్లో  బాకీ మొత్తం తీర్చెయ్యాలని ,తీర్మానించారు . మనకాడ చూస్తే కానీ డబ్బుల్లేవు . నాకు ఏంచెయ్యాలో పాలుపోక పిచ్చెక్కి పోతుంది , ఇప్పటికిప్పుడు  సొమ్ములు ఎలా తేగలం పట్నానికి పోయి నాలుగు డబ్బులు తెద్దామంటే ఆ పండిన కాస్తా ఎవరు చూస్తారు . గంజి కైనా వస్తాయి కదా . ఎలా అప్పు తీర్చి మళ్ళీ మనం నిలదొక్కుకోవాలో అంటూ బావురుమన్నాడు . ఇంతలో అటుగా వచ్చిన సీతాలు , ఇదిగో సోములు నేను అంతా విన్నాను . నా దగ్గర నిన్ను గట్టెక్కించే మార్గం ఉంది . చెప్తాను  విను. మొన్ననే ప్రెసిడెంటు గారి అమ్మాయికి ప్రసవం అయింది . ఆ అమ్మాయి అత్తారింట్లో  సాయానికి ఒక అమ్మాయి కావాలంట . కూడా తీసికెల్లిపోతుందట . తిండి, గుడ్డ, మందు ,మాకు అన్నీ బాగోగులు వాళ్ళే సూసి నీకు తిరిగి సొమ్ములిత్తారంట . మీ సిన్నీ ని పంపావంటే  నీ అప్పు తీరుతాది ,నీ భూమి మిగులుతాది . ఆలోచించు . ఎప్పుడంటే అప్పుడు నువ్వెళ్ళి సూసి రావచ్చు .మీరు ఊ అంటే వాళ్లకి చెప్తాను . అని చెప్పి వెళ్లి పోయింది .
సిన్నీ జాతరలో  తుళ్ళి తుళ్ళి ఆడుతుంది . తన ఇంట్లో కార్చిచ్చు తనకు తెలీదుకదా . కానీ రాములమ్మకి , సోములుకి గుండె బ్రద్దలయినట్టుంది . సిన్నీ ని పంపించాలనే ఆలోచనే , కాని వాళ్లకి ఉన్న ఒకే ఒక దారి సిన్నీని పంపించడం . ఆ రాత్రి కాళరాత్రే అయింది . ఏడ్చి ఏడ్చి ఇద్దరి కళ్ళలో కన్నీరు ఇంకిపోయింది . సమయం లేదు
పొలం చేజారకుండా ఉండాలంటే సిన్నీ ని పంపించాలి . అవును తమ ప్రాణానికి ప్రాణమైన సిన్నతల్లిని ఆ పెద్దింటికి పనిపిల్లగా పంపించాలి . ఒకరికొకరు ధైర్యం చెప్పుకొని  కొన్ని సంవత్సరాలు తమ గారాలపట్టిని ,పట్టణానికి పంపాలని నిర్ణయించుకొన్నారు . ఇంతలోనే చేతి నిండా జీళ్ళు ,బొమ్మలు పట్టుకొని పట్టలేని ఆనందంతో పరుగులు తీస్తూ వచ్చేసింది ,సిన్ని అమ్మా ,నాయనా మీరెందుకు రాలేదు ,ఎంత సంబరంగా ఉందో తెల్సా జాతర ,అమ్మోరికి మొక్కుకున్నా చందమామ వెళ్ళినప్పుడు నన్నూ పట్టణం పంపించమని , ఇందా మీకోసం జీళ్ళు తినండి ఎంత బాగున్నాయో , నాయనోయ్ నన్ను బేగా లేపు బంతిమొక్కలకు నీల్లెయ్యాలి . లేగాదూడకి డాటారు కాడికి తీసుకెళ్ళాలి . బుజ్జిముండ ఏమి తినడం లేదుకదా .. నేను చందమామతో ఒక మాట సెప్పి పడుకొంటా అంటూ పెరట్లో నులక మంచం మీద వాలి ఊసులు మొదలెట్టింది తన జతగాడు చందమామతో ,కానీ వెన్నెల్లో నిద్రపోతున్న సిన్నీ కి తెలీదు రేపటి ఉదయం తన బాల్యాన్ని కఠోరంగా కాటేస్తుందని ,కమ్మని కల ఈనాడే చివరిదని ,
తెల్లారింది . ఎలా ఎలా తన సిన్నీ కి ఆ విషయం సేప్పాలో అని ఒకరినొకరు బేలగా చూసుకొంటూ ,ఏమే సిన్నీ
 అదికాదే , మనూరు పెసింటు గారి అమ్మాయి సుగుణమ్మ తెల్సా .. అవునవును ఆ అమ్మాయి గారికి ఒక సంటి పాప కూడా ఉంది . ఎంత ముద్దొత్తదొ .ఎత్తుకొని ముద్దాడాలనిపిస్తుంది . అవునే తల్లీ ఆయమ్మ కూడా నువ్వు పట్నం పోవాలె . పాపని ఆడించడానికి ,ఎత్తుకొనీకి ,మా మాట విని ఎల్లు సిన్నీ ,మద్దెలో మేం నిన్ను సూడ్డానికి వత్తాం .  అమ్మో నేనెల్ల . నిన్ను నాయనను సూడకుండా ఒక్క రోజైనా ఉండలేను . ఏడుపొత్తాది . అంటూ నాన్న ఒళ్లో తల వాల్చింది . అదికాదే బంగారు తల్లి మీ నాయననేను కూడా  కొన్ని రోజులు తర్వాత నీ దగ్గరికే వచ్చేత్తాం . నా తల్లి కదూ . నువ్వు పోక తప్పదే సిన్నీ , నీ బట్టలన్నీ సర్ది పెట్టుకో , అక్కడ వాళ్ళు చెప్పింది విని సిన్నీ మంచి పిల్ల అనిపించుకొని మీ నాయనకు ,నాకు మంచి పేరు తేవాలె . అంతే కాదు ఎప్పుడైనా మా మీద దిగులేస్తే నీ జతగాడు అక్కడే  ఉంటాడు . ఆ  చందమామకి సెప్తే వచ్చి మాకు నీ ఊసులు సేప్తాడు . వెంటనే మేము వచ్చేత్తాం .
సరే నువు సెప్పినట్టే సేత్తాలే అంటూ మూతి ముప్పై వంకరలు తిప్పింది . హమ్మయ్య అది ఒప్పుకొంది . అనుకొన్నారే గాని ఇద్దరికీ కన్నీరైతే ఆగలేదు . ఉదయాన్నే సుగుణమ్మతో  పాటు రైలెక్కిన సిన్నీ కి , ఒక పక్క పట్నం పోతున్నాననే సంభరం . వేరే పక్క అమ్మా ,నాయనను వదిలెల్లాలనే దిగులు కల్సి బిక్కమొకమేసుకొని
సూత్తుండిపోయింది . రైలు పట్నానికి పరుగులు తీసింది .స్టేషన్ రానే వచ్చింది . సుగుణమ్మ కోసం కారు వచ్చింది .
 అంతా కొత్తగా ఉంది . కిటికీ నుండి చూస్తే ఆకాశాన్నంటే భవనాలు ,అన్నీ వింతలే  కళ్ళు విప్పార్చి సూత్తూనే
ఉంది . ఇంటికి రాగానే సుగుణమ్మ అత్తగారు ఎదురయ్యారు . దిష్టి తీయించి లోనికి తీసుకెళ్తూ ,ఆ పిల్లెవరే నీకూడా
పాపని ఎత్తుకోడానికి , ఆడించడానికి బాగుంటుందని మా ఊరినించి తెచ్చానత్తయ్యా అంది . సర్సరే దాన్ని బయటే ఉండమని మీరు ముందు రండి . అంటూ లోనికి తీసుకెళ్ళింది తల్లిని ,పిల్లను , సిన్నీ వాకిట్లో నిలబడి చూస్తుండి పోయింది . అంతా  అయోమయం . ఇంట్లో చంటిపాప వచ్చిన సందట్లో చుట్టాలు తో సిన్నీ విషయమే మరచిపోయారు . సిన్నీ కి ఆకలి , నిద్ర ముంచుకొచేస్తుంది . ఆరుబయటే మోకాళ్ళ పై తల వాల్చి నిద్రపోయింది . కొన్ని గంటల తర్వాత సిన్నీ గుర్తొచ్చి బయటకు వచ్చింది సుగుణమ్మ . సిన్నీ ని తట్టి లేపి ఏమే పిల్లా అప్పుడే నిద్దరొచ్చేసిందా .. పదపద అంటూ లోనికి తీసుకెళ్లింది . అత్తగారు ఏవే పిల్లా పని సేయడానికి వచ్చావా పడుకోవడానికి వచ్చావా అంటూ వంటగది చూపించి అంట్లున్నాయి ముందు తోమేసెయ్ . ఆ తర్వాత అన్నం పెడతానంటూ  హాల్లోకి వెళ్ళిపోయింది . సిన్నీకి ఏమి అర్ధం కాలేదు .  పాపతో ఆడుకోవాలి అని కదా అమ్మ అంది .
మరి వీల్లేంటి అంట్లు తోమ్మంటున్నారు . అనుకొంటుండగానే మళ్లీ సుగుణమ్మ వచ్చి ఇంకా తోమలేదా అంటూ కేక వేసింది . అంతే తుళ్ళిపడ్డ సిన్నీ తనకు అలవాటు లేకపోయినా తోమడం మొదలు పెట్టింది . కడుపులో పేగులు మెలేస్తున్నాయి ఆకలితో ,పక్కనే ఉన్న కుళాయిలో నీళ్ళు దోసిళ్ళతో త్రాగుతూ ,ఈ పాటికి అమ్మైతే నేను వద్దంటున్నా ముద్దలు సేసి పెట్టేది . అనుకొని కళ్ళనీళ్ళు కార్చేసింది . ఒక సత్తు పళ్ళెంలో కొంచెం అన్నం పెట్టి తెచ్చి
ఆ  ప్రక్కన కూచుని తిను అంటూ పడేసి విసవిసా లోనికి వెళ్ళిపోయింది . సిన్నీకి ప్రాణం లేచొచ్చింది . అన్నం సూడగానే ,గభగభా ముద్ద నోట్లో పెట్టీ పెట్టగానే తన పళ్ళెం లో  కలబడిపోయింది ఆ ఇంటి బొచ్చుకుక్క . ఒక్క మెతుకు లేకుండా  మొత్తం తినేసింది . భయంతో చూస్తుండిపోయింది సిన్నీ దాన్ని అదిలించలేక . అమ్మ నాయనలు అప్పటికే వందసార్లు గుర్తొస్తున్నారు . ఆపై ఆకలి . ఇంతలో పాపని తెచ్చి దీనికి పాలు పట్టించు అని చేతికిచ్చి పోయింది సుగుణమ్మ . సేతిలో సిన్నిపాపను సూత్తే ముద్దేసింది . సిన్నీకి పాలు పట్టించి ఎత్తుకొని ఆడిస్తూనే ఉంది .
కొంతసేపటికి పాపను అమ్మకిచ్చేసి అమ్మగారు నాకు నిద్దరోస్తుంది . పడుకొంటానంటూ కళ్ళు నులుపుకొని అడిగింది . సరే పడుకో అంటూ  ఆ టామీ కి పక్క వైపు పడుకో అని గొనె పట్టా చేతికిచ్చింది . తప్పదని అర్ధమైన సిన్నీ టామీ కి కొంచెం దూరంగా భయంభయంగా పడుకొని ,ఒక్కసారి చందమామ పట్నంలో కూడా ఉంటాడని అమ్మ సెప్పింది . కనబడితే అమ్మకు కబురెట్టాలి . ఇక్కడ భయమేస్తుందని ,ఆకాశమే కనిపించదేంటి ఈ ఇంట్లో ,అనుకొంటూ మేడ మెట్లు ఎక్కింది . యెంత ఎక్కినాఆయాసం వస్తోంది గాని  ఆకాశం మాత్రం కనబడలేదు . అవును మరి అది పది అంతస్తుల భవనం . మళ్ళీ ఉస్సూరని కిందకి వచ్చి రొప్పుతూ నిద్రలోకి జారుకొంది . ఆరోజు నుండి ఒక్కరోజు కడుపు నిండా తిన్నదీ లేదు . ఒక్క క్షణమైనా తీరిక దొరికిందీ లేదు . చిట్టి చేతులు పొట్లుపోయి మంటలొస్తున్నా .. కన్నీరు కార్చికార్చి చెంపలన్నీ చారికలవుతున్నా ... అమ్మా , నాయన పై దిగులుతో గుండెలవిసిపోతున్నా ,ఎప్పుడూ ఊసులు సెప్పే సందమామా కంటికి కూడా కనపడకున్నా .. ఆ పది ఏళ్ళ పసిమొగ్గ  మొక్కవోని ధైర్యంతో ఎదురు చూస్తూనే ఉంది . తనవారి రాక కోసం ,చందమామ ఓదార్పు కోసం , ఎంతగా సిదిమేసారంటే ఆ మొగ్గని ముద్ద బంతిలాంటి ఆ మోము అంద విహీనంగా మారి అస్థిపంజరంలా మారిపోయింది . కానీ సిన్నీకి మాత్రం తెలిసింది . పట్నమంటే  పంజరమని , హాయిగా హాయిగా చెట్లు ,పుట్టలు ,చిలుకలు ,లేగదూళ్ళతో ఆడి పాడి అమ్మానాన్నల ముద్దులపట్టీ , చందమామకు నచ్చిన జతగత్తె అయిన సిన్నీకి పట్నమంటే పరమ అసహ్యమేసింది . ఉన్నపళంగా ఊరికి పారిపోవాలని గట్టిగా నిర్ణయించుకొని  , చీకటి పడే వరకూ వరకూ ఓపిక పట్టింది .
సిన్నీ దగ్గరకు రెపొద్దునే ఎల్దాం . ఉంటే తిందాం . లేదంటే పస్తులుందాం . ఆ నాయుడు గారికి మన ఎకరం అప్పుకింద ఒదిలేద్దాం . మన సిన్నీ   లేని బతుకులు మనకొద్దు . బిడ్డ కనపడక పోయేసరికి రాములమ్మ మంచం పట్టింది . సోములైతే మనిషిలాగా తిరుగుతున్నాడే గాని తన సిన్నీ లేక బాగా లొంగిపోయాడు . ఆరు నెలలకే వారి బతుకుల్లో ఆనందం ఆవిరైపోయింది . తిన్నా లేకున్నా కన్న బిడ్డలేని ఆ ఇల్లు నరకంలా మారిపోయింది . లేగదూడ దిగులుతో
 చచ్చిపోయింది . ముద్దబంతి తోట మోడు వారి పోయింది . ఊరే మూగబోయింది . సిన్నీ అందెల  సప్పుడు లేక ,
గుళ్ళో దేవుడు కూడా ఆత్రంగానే చూస్తున్నట్టున్నాడు . తన మెళ్ళోఆ చిట్టి  చేతులతో కట్టిన  మాల లేక ,
అదేమో గాని ఊరే దిగాలు  పడింది . తమ సిన్నతల్లి చెంతలేక ,సోములు రచ్చబండ దగ్గర అందరికీ ఆనందంగా సేప్పేసాడు .సిన్నీ కోసం పోతున్నానని , రేపు రేతిరికల్లా సిన్నీ తో ఊరికొచేత్తానని , తెల్లవారితే  పయాణం కన్న కూతురిని  సూత్తామన్న సంతోసంలో కనురెప్ప మూతపడట్లేదు వాళ్ళిద్దరికీ ,
అందరూ ఆదమరచి నిదరోతున్నారు . సిన్నీ మాత్రం ఎప్పుడెప్పుడు బయట పడాలా అని కాచుకొని కూచుంది . నెమ్మదిగా సంచీ పట్టుకొని తలుపు ఘడియ తీస్తుండగా వెనుకనుండి సుగుణమ్మ భర్త సిన్నీ చెయ్యి పట్టుకొని నోరు నొక్కేసి ,ఒక్క ఉదుటున రెండు సేతులతో సిన్నీని ఎత్తుకొని లిఫ్ట్  లోనికి  వెళ్లి మీట నొక్కాడు .  ఆ చేతుల్లో ఊపిరాడక గిలా గిలా కొట్టుకొంతుంది సిన్న తల్లి . పై అంతస్థు మేడపైన నిర్మానుష్యంగా ఉంది . ఎప్పటి నుండో సిన్నీ పైన కన్నేసిన ఆ కామాంధుడికి ఆ రాత్రే అవకాశం వచ్చింది ,ఆ    పసిమొగ్గను పరమ కిరాతకంగా మారిన  ఆ కామాంధుని రక్కస కేళిలో ఆ పసిమొగ్గ నిర్దాక్షిణ్యంగా నలిగిపోతూ ,చేతలుడిగి , కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతున్న  ఆ అభాగ్యురాలి కన్నులకు  ఆకాశం ఆరోజే కనిపించింది .  సిన్నీ కన్నులు శాశ్వతంగా మూతలు పడబోతున్న సమయంలో ,సందమామ కనిపించింది . అంతే  ఎక్కడ లేని సత్తువ తెచ్చుకోని సందమామా...  నువ్వు కూడా పట్నమొచ్చావా .. మీ అమ్మా నా యానా  నిన్నూ పంపించేశారా .. తొందరగా మనూరెల్లిపో .. లేదంటే అమ్మ నాయనను సూడకుండానే నువ్వు కూడా సచ్చిపోతావ్ .నాకోసం ఒక్కసారి కిందకొచ్చి నన్నూ నీతో తీసుకుపోవా .. ఊరికి పోవాలనిఉందిఊపిరి ఆగేలోపు ,
అమ్మా ,నాయనా .. సిన్నీ లేదని తింటన్నారో ,లేదో . ముద్దబంతి తోటకి నీరు పోత్తున్నారో  ,లేదో  , గుళ్ళోముగ్గులేత్తున్నారో , లేదో ,దేవుడికి పూలున్నాయో , లేదో నా లేగ దూడ పెద్దయిందో లేదో , అమ్మ ఏ బాధేసినా నీకే సెప్పమంది . వచ్చిన కాడినుండీ రోజూ భాదేసింది . కానీ నాకు ఎంతకీ నువ్వు కనబడలేదు . ఏడకెల్లిపోయావ్ పోనీలే ఇప్పుడైనా నన్ను తీసికెల్లి మన పల్లెలో వదిలిపెట్టు . నువ్వూ , నేను జత కదా ,పోదాం పద మన ఊరికి ఎంచక్కా !అంటూనే  ఊపిరి ఒదిలేసింది . సందమామతో ఊసులాడుతూ ....ఊగిసలాడుతున్న సిన్నీ సిన్ని ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది  . కానీ సిన్నీ మాత్రం సందమామలో ప్రతీ రేయి కనపడుతోంది . అది
సిన్నీని కన్నవాళ్ళ కే  కాదు . అభం శుభం ఎరుగని  చిరుమొగ్గల భవితను బుగ్గిపాలు చేసి ,  సోమ్ములకోసం పనిలో  చేర్చి తమ పబ్బం గడుపుకోవాలనుకొనే ప్రతి తల్లితండ్రులకూ సందమామ లోనే కనపడుతుంది సిన్నీ ప్రతిబింభం .ప్రతీ సిన్నతల్లి ప్రతిరూపం .

(దయ చేసి పిల్లలను డబ్బు కోసం పనిలో పెట్టొద్దు. వారి నిండు జీవితాన్ని నిప్పుల్లోకి నెట్టొద్దు. )
బాల కార్మికులందరికీ నా ఈ చిన్ని కధ అంకితం .)

                                                                  సాలిపల్లిమంగామణి @శ్రీమణి 

12, మే 2016, గురువారం

సఖా !నీకోసం.


సఖా !నీకోసం.నిలువెల్లా వేచా!కన్నుల  వెన్నెల్లో నిన్నే కొలిచా!
ప్రియసఖా!నీకోసం హొయలన్నీ దాచా!ఊహల ఉయ్యాలలో 
వెచ్చని నా ప్రాయం పదిలంగా  నీకై పరిచా !
వేయివేయి కలలను నా కన్నుల్లో మోసా.. 
చేయిచేయి కలుపుకొన్న గురుతులు గుండెల్లో గుప్పుమంటూ 
గుబులు రేపుతుంటే,హాయిహాయి నిట్టూర్పులు తనువంతా తడిమేస్తే 
మోయలేని నా ప్రాయం నీ కోసం వేచియుంది. 
 యమునా తీరంలో సవరించిన నా కురుల సాక్షిగా .. 
చేసుకొన్న ప్రమాణాలు మరచీ పోతివా ,
పొతే పొనీలెమ్మని నన్నిడిచిపోతివా !
నీ సమ్మోహన రూపంతో నన్నావహించీ,ఇప్పుడు  కినుక వహించి 
చప్పుడు చేయక ఎక్కడ దాక్కున్నావు?భావ్యమేనా ...
ముగ్ధ మోహనాంగినని,నను తెగ పొగిడావు. 
ముద్దమందారమని ముద్దాడావు. 
ముత్యాల మురిపాల తడిపేసావు. 
అచ్చంగా దొంగల్లే దోచుకెళ్ళావు,నా హృదయాన్ని నీతో తీసుకెళ్ళావు 
దోబూచులాడుతున్నావు,సఖా !దొంగాటలాడుతున్నావు. 
బాసలు మరిచావో,లేక భామల నడుమ మదనుడివయ్యావో 
పొన్న చెట్టు నీడలో నీకు వెన్న పెట్టినప్పుడు,నేనెన్నటికీ నీవాడనని 
నిన్నెన్నటికీ  వీడనని, చేసుకొన్న బాసలు మరిచావా! మదనమోహనా 
నిలువెల్లా కనులై , తనువంతా నీ వలపుల తలపులై 
అణువణువులోనూ... నిన్నే చూస్తున్నా.. 
ప్రతీ క్షణం .. నీకై నిరీక్షిస్తున్నా 
నిర్లక్ష్యం సేయక ఆఘమేఘాల పై 
పయనించి రావా ... నీ రాధకోసం నిమిషంలో రావా ... 
నిలుపవా నా ప్రాణం...కృష్ణా!నీ రాకను కానుక చేసి 
నీ మురళీ సుధా రవళీ రసమున  నను ఓలలాడించి 
                            
                                       ( రాధ నిరీక్షణ  మాధవునికై )
                                                      సాలిపల్లి మంగామణి@ శ్రీమణి 

9, మే 2016, సోమవారం

అమ్మను అయితే అయ్యాను,గానీ ......????????????




అమ్మను అయితే  అయ్యాను,గానీ ... 
ఏదో సంధిగ్ధంతో సతమతమవుతూనే ఉన్నా ...
 నా బిడ్డడు ,రాముని తలపించే  ఆదర్శమూర్తిగా అవతరిస్తాడో .. 
 రక్కసుడల్లె  కర్కశుడే  జనియిస్తాడో ?
కన్నతల్లికి, జన్మభూమికి   ఖ్యాతి పెంచే  రత్నమల్లె మెరిసిపోతాడో ..    పుడమి  తల్లికే కే పెను భారమయ్యే కరుడు గట్టిన  పాషాణమల్లే  పరిణమిస్తాడో , 
కన్నవారినీ ,కాలరాసే  కాల యముడికి ఊపిరోస్తానో .. 
కలియుగానికి ఆలవాలమవు   అపర రావణున్నే ఇలకు తెస్తానో ,
కీచకుడే పుడతాడో ,సమాజానికి పట్టిన  చీడపురుగుల్లో ఒకడికి నేనే తల్లవుతానో ,
ఒక మానవత్వమూర్తినే కని  తెగ మురిసిపోతానో .. 
మహాత్ముడు కాకున్నాగాని,మంచికి ఊపిరిపోసే మాన్యుడైతే చాలు .  
నలుగురితో  నారాయణ కాదు  . పలువురికోసం  ప్రాణాలిచ్చే ,
జన్మభూమికి వన్నె తెచ్చే , 
అనాకారియైనా ఆనందమే ,అహంకారి కాకుంటే సరి . 
ఆ యమ్మ కన్నబిడ్డ కనకమనిపించాలి .
కనకనే . కునుకే కరువయి  ఓ  అమ్మ పడే    ఆరాటం . 
పాపో ,బాబో తెలిపే పరికరాలు పుట్టెడు ఉన్నా , పట్టెడు మెతుకులు పెడతాడని ,
మంచికిమారుగా పుడతాడని ,చెప్పే యంత్రం ఉంటే బావుండుకదా !
 చీడ పురుగునుకడుపులోనే కాలరాసి ,
మానవత్వం పరిమళించే మాన్య బిడ్డకు జన్మనిచ్చి ధన్యమవదా ..ప్రతి కన్నతల్లి .   (సమాజంలో జరుగుతున్న అరాచకాలకు భయభ్రాంతురాలైన నిండు గర్భిణి ఆవేదన )
.నిజానికి పుట్టినప్పుడు ప్రతీ బిడ్డా పరమ పావనుడే ,ఏ బిడ్డా జన్మతః దుర్మార్గుడు కానేకాదు . 
 బుద్ధి నెరిగిన నాటి నుండే , వక్రమార్గపు వెతుకులాటలు .,వెర్రితలలు వేస్తున్న అక్కర లేని  ఆధునికతల ముసుగుల్లో , వింత వింత పోకడలు , మత్తుల్లోమునిగిపోయి  మతిభ్రమించి పరిభ్రమించేరు అభినవ కౌరవుల్లా .. 
అందులకే చెబుతున్నా .. 
తల్లులార మీ బిడ్డల భవితకు బంగారు తాపడాన్ని మీరే అద్దాలి . 
తల్లి తలచిన కాని కార్యము లేదు జగాన తనయుల తీర్చి దిద్దుటలో ..... రేపటి పౌరునిగా మలచుటలో .. 
ఉగ్గుపాలు , ముద్దు మురిపాలతో ,పాటు 
మానవత్వపు పాలు  రంగరించి పెంచి చూస్తే  ప్రతీ తల్లి . 
పెడత్రోవకెక్కడ తావుంది ?ప్రేగు పంచుకొన్న బంధానికి ?
మన సుసంపన్న సంస్కృతినీ ,సాంప్రదాయ రీతులనీ ,నైతిక విలువల్నీ, అక్షరాభ్యాసంతో పాటూ అవపోసన పట్టిస్తే ,
ఆణిముత్యమల్లే మారడా ... అమ్మా ,నాన్నల కనుల వాకిలిలో 
 కోరుకొన్న భవితవ్యం రంగవల్లిగా తారసపడదా  .  ఏ ఆధునికత ప్రభావమైనా ,పెచ్చు మీరిన సాంకేతిక విజ్ఞానమైనా ,తల్లి నేర్పిన మొదటి పాఠపు పరిజ్ఞానం ముందు పటాపంచలయిపోదా . దుష్టలోచన దూరమవదా ..  
 ఎన్ని యుగాలు మారినా ,ఒక కన్న తల్లి   సంకల్పిస్తే ,ప్రతీ బిడ్డ  పసిడి తుల్యం . 
సమాజ ప్రక్షాళనలో ప్రముఖ పాత్రధారిణి  మాతృమూర్తి .  నవ సమాజ నిర్మాణంలో క్రియాశీలి ఒక తల్లే . 
అందుకే , తల్లి చూపిన సన్మార్గమే రేపటి కల్మష రహిత సమాజానికి వారధి . ప్రతీ తల్లీ సారధే ..  రేపటి భావి భారత పసిడి రధానికి .  మొక్కై  వంగనిది . మానై వంగునా .. అంటూ ఊరక కూచోక 
 నారులోనే మానవత్వపు నీరుపోసి ,మంచి మార్గం నిర్దేశిస్తే , నిక్కంగా కొంగు బంగారమే ,అమూల్యమైన బహుమానమే,అమృత ఫల నైవేద్యమే 
ప్రతీ బిడ్డా ..  పరమ పావన భారతావనికి . (అవునంటారా నా మాటలను , కొట్టి పారేస్తారా నీతులని )           
                                                            సాలిపల్లిమంగామణి @శ్రీమణి 

6, మే 2016, శుక్రవారం

ఊరట కావాలా ?


పడి లేచే కెరటానికి ఇసుమంతైనా లేదే అలసట..  
నిత్యం వీచే గాలికి ఏనాడంట ఊరట?
నిత్యం ఘోషించే సంద్రానికి నోరెండిపోతుందా ?
అలుపెరుగకఅవనిని  పాలించే ఆ సూరీడుకి ఆటవిడుపు ఏనాడు?
నిశిరాతిరి అయినా నిదురేది,తీరిక కుదిరేది , ఆ రేరాజుకి 
నేలతల్లి తల్లడిల్లి భారంమోయనంటూ చేతులెత్తేస్తే చేసేదేముంది . 
ఆఆకాశం వేసారి రాజీనామా చేస్తుందా !తనవల్ల కాదంటూ.. 
నీలిమబ్బు శలవంటూ..
 వీడుకోలు పలికితే చుక్క ఒలుకుతుందా... 
పుడమిన నీటిచుక్క మిగులుతుందా ... 
నిత్యం పరుగెడితే నీరసమొస్తుందందా!సాగే సెలయేరు. 
అమ్మ నొప్పులనోర్వను,నేనంటే నీ ఉనికెక్కడ ఉంది. 
పరోపకారార్ధం ప్రకృతిలో ప్రతి అణువు శ్రమియిస్తే .. 
మనకోసం మన మనుగడ కోసం చేసే మన  కర్తవ్యంలో 
ఎందుకంత అలసట?ఎందుకు కావాలి ఊరట ,
ఆశావహ ధృక్పదంతో అడుగులు వేస్తూ ఉంటే.. 
అనుకొన్నది. ఆసన్నమవదా... అరనిమిషంలో ... 

                                                            సాలిపల్లి మంగామణి @శ్రీమణి 

5, మే 2016, గురువారం

ఎన్నాళ్ళిలా ..?


ఎన్నాళ్ళిలా ..?
 పావలా బతుకులో  ముప్పావలా వెతలు
 పట్టెడు   మెతుకులకై పుట్టెడు అగచాట్లు . 
 కంట కన్నీళ్లు ,ఇంట గంజి నీళ్ళు .  
 భూమి పుత్రుల ఆత్మార్పణలు ,
 ఎన్నాళ్ళిలా.. ?
 మంచం లేచిన మొదలు లంచపు లాంచనాలు . 
 గమ్మత్తులు చూడాలని మత్తుల్లో తూలుతూ 
 మరమ్మత్తు చేయలేని మరబొమ్మ గా మారుతున్న వైనాలు
 కుప్పతొట్టికి బహూకరించిన పసిమొగ్గల  ఆక్రందనలు 
  చీత్కారంతో తల్లిదండ్రులకు నడిరోడ్డు సత్కారాలు 
  ఎన్నాళ్ళిలా .. ?
 అడుగడుగునా అబలలపై  అకృత్యాలు 
  అడ్డుకట్టలేని అవినీతి మురికి కూపాలు . 
  మసక బారిపోతున్న మానవత్వపు  ఆనవాళ్ళు . 
 మర జీవనాలు,అనురాగ రహిత జీవశ్చవాలు 
 నల్లధనం మూటలు ,కోటలు దాటిన మాటలు 
 ఎన్నుకొన్న నాయకుల వెన్నుపోట్లు ,పన్నుపోట్లు 
 అడుగడుగునా  విద్య విక్రయశాలలు . 
 పైసా లేక ఆసుపత్రుల్లో అసువులు బాసిన అభాగ్యులు 
 ప్రభుత్వంలో భుక్తాలు ,
 పాలనా యంత్రాంగంలో మంత్రాంగాలు 
  దొంగోడే దొరలా ..   నిలువు దోపిడీ విధానాలు . 
 నీరసించిన ధర్మపాదం . 
 పెచ్చుమీరిన  అధర్మ వాదం . 
 ఎన్నాళ్ళిలా ...?
 రాదంటారా కలలు గన్న సమాజం . 
 లేదంటారా .. సుభిక్షమయిన  జనజీవనం 
 అర్ధ రహితమంటూ  .... వృధా యత్నమంటూ 
ఈ వ్యవస్థ ఇంతేనని తమ  మట్టుకు తలపట్టుకు కూచోక 
మీ నుండే మొదలెడితే  .. మార్పు అనే మరమ్మత్తు.  
మన  వంతుగ కృషి చేస్తే  ..మాన్యమగు  వ్యవస్థ తధ్యం 
 ప్రతీ నీవు స్పందిస్తే ప్రపంచమే మారదా ... 
 పట్టు వీడక ప్రయత్నిస్తే పసిడి పండదా బీడు భూమిలో .... 
 ప్రయత్నిద్దాం ... ప్రయత్నిస్తూనే ఉందాం . 


                                                           సాలిపల్లిమంగామణి @శ్రీమణి  
                                            http://pandoorucheruvugattu.blogspot.in




1, మే 2016, ఆదివారం

సమిధనయినా...చాలు!









 శ్రీశ్రీ నాటిన అభ్యుదయ సాహితీ వనంలో ..
నేనొక గడ్డి పూవునయినను చాలు . 
ఆ అభినవ సూరీడు నడిచిన దారిలో......
        ఇసుక రేణువునయినను చాలు
ఆ అభీకుని కలం విదిల్చిన మహా ప్రస్థానంలో 
చిరు సిరా బొట్టు నయిననూ చాలు . 
ఆ కవీంద్రుని  కలాన జారినకావ్యంలో  ....... 
     నేనొక అక్షరమయిననూ చాలు . 
ఆ దార్శనికుని కవన సంద్రాన 
 ఎగిసిన అలనయినా చాలు . 
           భాదిత జనాల బాసట  నిలువగ,
           పీడిత జనాలకూపిరులూదగ ,
   ఆ అభీకుడు తలపెట్టిన 
మహాయజ్ఞం ప్రజ్వలించుటలో 
సమిధనయినా మేలు. 
ఆ మహనీయుని ఆశయాల సాధనలో 
నా  ఉడత సాయమందిస్తా ... 
సమ సమాజ స్థాపనలో ,
నా చిరు కవితాస్త్రాన్ని  సంధిస్తా .... 
(నాలుగో తరగతి నుండే శ్రీశ్రీ గారి కవితల్లో అర్ధాన్ని గ్రహిస్తూ,
వారినే అనుకరిస్తూ చిరు ప్రాయం నుండీ శ్రీశ్రీ గారి ఏకలవ్య శిష్యురాలిగా నన్ను నేను ఒక విప్లవకవితతో కవయిత్రిగా మలుచుకొన్నా... వారి జయంతి సందర్భంగా 
నివాళులర్పిస్తూ.......సాలిపల్లిమంగామణి  @శ్రీమణి  
                                             కళావేదిక కల్చరల్ &ఛారిటబుల్ ట్రస్ట్ 
                                                                                 సాలిపల్లి మంగామణి @శ్రీమణి 

                                                                                (కళావేదిక కల్చరల్ &చారిటబుల్ ట్రస్ట్ )